The following article in pdf can be downloaded from here
'శశిరేఖ ' గురించి రాస్తూ శ్రీ శివశింకరశాస్త్రి తన పీఠికలో-'ప్రేమ శాశ్వతమా చంచలమా అని కొందరు ప్రశ్నిస్తారు. గాడానురాగం శాశ్వతము కాదని యెవరనగలరు? అయితే జీవితంలో ప్రేమ ఒకసారి కలుగుతుందా, అనేక పర్యాయములు ఉదయిస్తుందా? ఈ విషయంలో భేదాలున్నవి. ప్రేమామృత ఝరి హృదయంలో నిరంతరమూ ప్రవహించేవారు ఎక్కువసార్లు ప్రేమించగలరు. ఏక కాలములో ఇద్దరు వ్యక్తులను మాత్రము సమానముగా ప్రేమించడం అసంభవం. ఒకరిమీద అనురాగం సడలిపోయిన తర్వాత ఇంకొకరిమీదికి ప్రసరించవచ్చును ' అని కథానాయికను జాగ్రత్తగా సమర్థిస్తూ ' ఈ కథానాయిక సామాన్య స్త్రీ కాదు. ఈమె ప్రేమైక జీవిని. అందుచేతనే తనకు యోగ్యుడైన ప్రియునికోసమై ఎట్టి త్యాగమైనా చేసింది. స్వాతంత్ర్యములేని సామాన్య స్త్రీలవంటి పతివ్రత ఈమె కాదు ' అని రూలింగ్ యిచ్చారు.
రామ్మూర్తి రత్నమ్మ, చలం-కృష్ణశాస్త్రి. సత్యవతి వీరి సంబంధాలను వ్యావహారిక జగత్తు నుంచి విడదీసి చూడడానికి తాత్త్వికమైన ప్రాతిపదికను శాస్త్రిగారు తమ పీఠికలో తెచ్చియిచ్చారు. శశిరేఖ గురించి చలమే ముగింపులో దేవదూతచేత యిలా అనిపిస్తాడు. 'అవును, యీమె ఆ లోకంలో వుండతగినది కాదు. ఎక్కడ ప్రేమకు అంతంలేదో, అంతా ప్రేమమయమో, యెక్కడ ప్రేమకు నీతిదుర్నీతి అనునవి లేవో, అట్టి లోకానికి వొస్తోందీమె. తన మనోకల్పితములైన దివ్య ప్రేమమూర్తులతో లీలలకై యీమెకు వరమీయబడినది. ప్రేమించినవారికి పాపములేదు. ప్రేమ మూర్తి, ప్రేమాగ్నిలో తప్తమైన పరిశుద్దమైన దీమె ఆత్మ. ధన్యురాలు, ప్రేమించినది’
రామ్మూర్తి కలకత్తా వెళ్ళకముందు ఓసారి నేనూ అతనూ మాట్లాడుకుంటున్నాము.
'రామ్మూర్తీ! నాకు తిరిగి తిరిగి ఓ సందేహం వొస్తో వుంటుంది. ఎక్కడైనా ఏ అందమైన స్త్రీలను చూసినా నేను చాలా attract ఔతాను. అది పాపమంటావా నువ్వు?'
'పాపమనే అంటాను నేనూ’ అన్నాడు అతను.
'పాపకార్యాలమీద చాలా రోతనాకు. ఒక అబద్దం చెప్పాననుకో ఎంత బాధపడిపోతానో! నన్ను నేను అసహ్యించుకుంటాను. సిగ్గుపడతాను. పశ్చాత్తాప్పడతాను. ఏ పాప కార్యమైనా నా కంతే. కాని స్త్రీకై నేను పడే ఆకర్షణలో నాకు సంతోషం తప్ప ఏ బాధారాదు. '
'ఔను, ఆ ఆకర్షణతో అంతమైతే అందాన్ని చూసిన బాధ తప్ప అంతకన్నా కోర్కె లేకపోతే దాంట్లో తప్పేముంది. ' అన్నాడు.
'అమ్మడితో ఆగదె. ఆమెను కావిలించుకోవాలని, ముద్దులు పెట్టుకోవాలనీ గొప్ప ఆశ కలుగుతుంది. ఒకవేళ ఆమె కూడా నన్ను యిష్టపడ్డట్లయితే నా ఆనందానికి మేరలేదు. ఇంత ఆనందమిచ్చే పని, పాపం, తప్పు అంటే నేను నమ్మలేకుండా వున్నాను. పాపంలో అంత ఆకర్షణ ఉంటుంది అంటావా?'
'తప్పకుండా వుంటుందీ '
'ఔను, నాకు తెలుసు. పురాణాలు, శాస్త్రాలూ, పెద్దలు, మన బ్రహ్మ సమాజపు గురువులు అందరూ గట్టిగా ఖండిస్తారు. వారు చెప్పేదంతా నిజం రావొచ్చు. కాని నాకు నిజమనిపించదు. మనం కులాల్ని విగ్రహారాధనల్ని, తద్దినాల్ని, వీటన్నిటిని అతిక్రమించాం. ఈ నీతులకి మాత్రం ఎందుకు లొంగిపోవాలి? ఎప్పుడన్నా దేవుడు ఈ పనులన్నీ చెడ్డవని చెప్పాడా?'
'కాని నీ అంతరాత్మ ఏమైంది?'
'నా అంతరాత్మ దీంట్లో ఏమీ తప్పు లేదని చెపుతోందీ '
ఏమోనబ్బా నాకు తెలియదు. ' అన్నాడు రామ్మూర్తి..
గోదావరి ఒడ్డున గడిపిన సాయంకాలాలలో అతను అనుభవించిన సంఘబహిష్కరణను తనతో పాటు పాట్లు పడుతున్న రంగనాయకమ్మగారి పట్ల జాలిని వ్యక్తం చేస్తాడు చలం !
ఆమెకు కావలసింది జాలి మాత్రమేనా -' నా మీద ఎంత కోపం వుండనీ, నన్ను నమ్మి ఈ నిర్భాగ్య జీవితంలో నాతో నిలిచి వుంటుంది రంగనాయకమ్మగారు. లోపల పిల్ల కదిలే పెద్ద పొట్టతో అన్ని పనులు చేసుకుంటోంది. వెలిపడ్డ మాకు దాసీ వుండదు. చాకలి వుండదు. కొన్ని సమయాల్లో విరోధం తక్కువగా వున్నప్పుడు నవ్వుకుంటూ యిద్దరం అంట్లు తోముకునే వాళ్లం. బట్టలు వుతుక్కునేవాళ్లం . స్నేహంగా పలకరింపులు లేకుండా అర్థం చేసుకునే చూపైనా లేకుండా బతుకుతున్నాము. ఏటి పొడుగునా మమ్మల్ని పలకరించే వాళ్ళులేరు. మమ్మల్ని విజిట్ చేసేవాళ్ళు అసలు లేరు. తను వొంటరి. నన్ను వొదిలిపోదామంటే తనకి ఎవరూలేరు తన బంధువుల్లో. నన్ను నమ్మి నాతో తను వెలిపడ్డది. నాకు మాత్రం ఎవరు తోడు? నాకు దేవుడూ లేడు.
గది గుమ్మంలో కూచుని అంతా నిద్రపోయాక చీకట్లోకి
చూస్తూ చావుపుటకల సమస్య గురించి కనపడని అర్థం కోసం తర్కిస్తూ
ఆలోచిస్తూ గడిపే వాడు చలం.
Print this post
1 comments:
చలం మైదానం ని నేను అర్థం చేసుకున్న తీరు గురించి నేను కొంత రాసేప్రయత్నం చేశాను. ఈ క్రింది లంకెద్వారా చూసి మీ స్పందన తెలియజేయగలరు.
http://parnashaala.blogspot.com/2009/03/blog-post_26.html
Post a Comment